Andhrapradesh
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలు, దర్శనాలు, గదుల్ని బుక్ చేస్కోండి
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్ 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేయనున్నారు. మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. అలాగే ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు.
ఏప్రిల్ 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను.. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. అంతేకాదు తిరుమల శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఏప్రిల్ 12న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 12వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 12న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. ఏప్రిల్ 17న ప్రారంభము కానున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు.
చంద్రప్రభ వాహనంపై శ్రీ కోదండరాముడి వైభవం
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు గురువారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో పార్థసారధి, సూపరింటెండెంట్ సోమశేఖర్, కంకణభట్టర్ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.