Andhrapradesh
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
Poleramma Jatara in Naidupet in Tirupati District : తిరుపతి జిల్లా నాయుడుపేటలో నేటి నుంచి 3 రోజులపాటు జరగనున్న పోలేరమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. దేవాదాయశాఖ అధికారులు సంప్రదాయబద్ధంగా పోలేరమ్మకు సారెను సమర్పించారు. స్థానిక అంకమ్మ గుడిలో పూజలు చేసి మంగళవాయిద్యాల నడుమ పోలేరమ్మ గుడి వద్దకు ఊరేగింపుగా వచ్చి సారెను బహుకరించారు.
పోలేరమ్మ జాతర సందర్భంగా గుడిని పూలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. భక్తుల అందరికి పోలేరమ్మ దర్శన భాగ్యం కలిగేలా సహకరించాలని డీఎస్సీ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పోలేరమ్మ జాతరలో చిన్నారుల నృత్యాలు చూపరులను అలరించాయి. కొందరు భక్తులు దేవతామూర్తుల వేషధారణలతో ప్రదర్శనలు నిర్వహించారు.
నాయుడుపేట శ్రీ పోలేరమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. మంగళవారం (మే 29) రాత్రి దేవతామూర్తిని పుర వీధుల్లో ఊరేగించి ఆలయం వద్ద ఉంచారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రెండు క్యూ లైన్లలో భక్తులు గ్రామ దేవతను దర్శనం చేసుకున్నారు. భక్తులను కట్టడి చేసేందుకు పోలీసులు తాళ్లు కట్టి ఏర్పాటు చేశారు.
ప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ శాఖ అధికారులు ఒక్కో భక్తుడు నుంచి రూ.100 చొప్పున వసూలు చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు భక్తులకు మజ్జిగ, ఆహారం అందించారు. అమ్మవారి జాతరలో భక్తులు అందరు పాల్గొనాలని ఆలయ అధికారులు కోరుకున్నారు. జాతరకు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలియజేశారు.