Andhrapradesh
ఉదయం వేటు.. మధ్యాహ్నం భర్తీ.. ఏపీలో సంచలనంగా ఈసీ చర్యలు
ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. ఈ ఉదయం పలువురిపై బదిలీ వేటు వేసింది. అయితే వెంటనే కొత్తవారిని నియమించింది.
ఐదుగురు డీఎస్పీలతో పాటు ఏడుగురు సీఐలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా సుధాకర్ రావు, గురజాల డీఎస్పీగా శ్రీనివాసరావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్ధన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి నియామకమయ్యారు. తిరుపతి స్పెషల్ బ్రాంచ్కు వెంకటాద్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తాడిపత్రి సీఐగా నాగేంద్రప్రసాద్, అలిపిరి సీఐగా రామారావు, ఎస్బీ ఇన్స్పెక్టర్గా విశ్వనాథ్ చౌదరి, నాగార్జునసాగర్ ఎస్సైగా పట్టాభి, కారంపూడి ఎస్సైగా కె. అమీర్ నియామకమయ్యారు. వీరంతా వెంటనే బాధ్యతలు తీసుకోకున్నారు.
కాగా ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ, ఆ తర్వాత అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. తిరుపతి, అనంతపురం, పల్నాడు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి. ఈ దాడుల్లో చాలా మంది గాయపడ్డారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అల్లర్లు చోటు చేసుకోవడంపై తీవ్రంగా సీరియస్ అయింది. ఆయా ప్రాంత ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ దర్యాప్తు ముగిసింది. ఉన్నతాధికారుల వైఫల్యం వల్లే శాంతి భద్రతలు అదుపు తప్పాయని నివేదిక అందడంతో తాజాగా కూడా పలువురు అధికారులపై వేటు వేసింది. వెంటనే వారి స్థానంలో కొత్తవారిని నియమించింది.