Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. అన్ని విషయాలు బయటకు వస్తాయి: జస్టిస్ చంద్ర ఘోష్
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కొనసాగిస్తోన్న సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఇవాళ మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. విచారణ ప్రారంభమైందని, ఇప్పటికే ప్రాజెక్టును పరిశీలించానని అన్నారు.
అన్ని విషయాలు సమీప భవిష్యత్తులో బయటకు వస్తాయని చంద్ర ఘోష్ చెప్పారు. 54 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారిస్తామని తెలిపారు. వాటిలో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా ఉన్నాయని అన్నారు. ఏజెన్సీలను పిలుస్తున్నానని వివరించారు.
నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా ఉన్న సమాచారం తీసుకుంటున్నామని చంద్ర ఘోష్ చెప్పారు. జూన్ 30లోపు విచారణ పూర్తి కాదని, ఇంకా సమయం పడుతుందని అన్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని తెలిపారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుందని అన్నారు.
ఏడుగురిని విచారణకు రావాలని ఇవాళ నోటీసులు ఇచ్చామని చంద్ర ఘోష్ తెలిపారు. మంగళవారం 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. సాంకేతిక అంశాల విచారణ పూర్తి అయ్యాక.. ఆర్థిక అంశాలపై విచారణ మొదలు అవుతుందని తెలిపారు.