National

ప్రారంభమైన ఐదో దశ పోలింగ్.. అందరి దృష్టి ఆ రెండు స్థానాలపైనే

Published

on

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంటోంది. ఐదో దశలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు సోమవారం పోలింగ్ మొదలైంది. ఈ దశలో మొత్తం 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ సహా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వంటి పలువురు ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా యూపీలో 14 స్థానాలకు ఈ దశలో ఓటింగ్ జరుగుతుండగా.. తర్వాత మహారాష్ట్ర (13), పశ్చిమ్ బెంగాల్‌ (7), బిహార్‌ (5), ఒడిశా (5), ఝార్ఖండ్‌ (3), జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లో ఒక్కో స్థానం ఉన్నాయి.

మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా విడతతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. వీటితో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలోని అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్‌గఢ్‌ పార్లమెంట్ స్థానాలు, దాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఓటింగ్ మొదైలంది.

ఇక, ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో అమేథీలో మాత్రం రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ప్రస్తుతం రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నుంచి రాహుల్‌ గాంధీ.. అమేథీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మ బరిలో ఉన్నారు. లక్నో నుంచి పోటీలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్ హ్యాట్రిక్‌పై సింగ్‌ గురిపెట్టారు. యూపీలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతోన్న 14 స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 13 సీట్లను దక్కించుకుంది.

బెంగాల్‌లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు నాలుగు దశల్లోనూ అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐదో దశలో 57% పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా 60 వేలకుపైగా కేంద్ర బలగాలు, 30 వేలమంది పోలీసులను మోహరించారు.

మహారాష్ట్రలోని ముంబయి నార్త్ నుంచి పియూష్ గోయల్, దిండోరి నుంచి భారతి పవార్, కళ్యాణ్ నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే, బిహార్‌లోని హజీపూర్ నుంచి ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ బరిలో నిలిచారు. ఇక, జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్‌ జరుగుతోంది. అక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా.. పీడీపీ నుంచి మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ మధ్య తీవ్రపోటీ నెలకుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version