National
చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు – మద్దతుకు విపక్షాలు నో! – Parliament Session 2024
తొలిసారి ఎన్నికలు
స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నికలు.స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపిన ఇండియా కూటమి.ఇండియా కూటమి తరఫున నామినేషన్ వేసిన కె సురేష్. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య కుదరని ఏకాభిప్రాయం.ఉపసభాపతి అవకాశం ఇండియా కూటమికి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదన.రాహుల్ ప్రతిపాదనపై స్పందించని అధికార పక్షం.అధికార పక్షం తీరుపై ఇండియా కూటమి నేతల అసంతృప్తి. స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీలో నిలిపిన ఇండియా కూటమి.
ఏకగ్రీవానికి మద్దతు ఇస్తామన్న ప్రతిపక్ష ఇండియా కూటమి మళ్లీ మాట మార్చింది. స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని సైతం పోటీలో నిలబెడుతామని స్పష్టం చేసింది. రాజ్నాథ్తో జరిగిన చర్చల నుంచి విపక్ష నేతల బయటకు వచ్చారు.
ఆ పదవి మాకిస్తే స్పీకర్ పదవి ఏకగ్రీవానికి ఓకే!
ప్రతిపక్ష ఇండియా కూటమికి డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇస్తే విపక్షాలు లోక్ సభ స్పీకర్ పదవి ఏకగ్రీవానికి ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్ డీఏ స్పీకర్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్పీకర్ ఎన్నికలో తమ మద్దతు కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలియజేసినట్లు రాహుల్ గాంధీ చెప్పారు. అలాగే విపక్ష నేతలను బీజేపీ అవమానిస్తోందని ఆరోపించారు.
Lok Sabha Speaker Election : లోక్ సభ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఉండడం వల్ల అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటమి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇండియా కూటమి తమ అభ్యర్థిని ప్రకటిస్తే లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ను అధికార పక్షం, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో ఎన్నుకుంటున్నాయి. ఈ సారి ఏం జరుగుందనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
విపక్షాలతో రాజ్ నాథ్ మంతనాలు
మరోవైపు, లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిపై ఏకాభిప్రాయాన్ని కుదుర్చేందుకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్షాలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా ఇతర ప్రతిపక్ష నేతలతో మంతనాలు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపారు.
కాగా, లోక్ సభ స్పీకర్ పదవి మరోసారి ఓం బిర్లాకే దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత లోక్సభకు ప్రొటెం స్పీకర్గా ఉన్న భర్తృహరి మహతాబ్ కూడా రేసులో ఉన్నారు. మంగళవారం స్పీకర్ పదవికి నామినేషన్ల ప్రక్రియ జరగనుండగా, జూన్ 26న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీఏ అభ్యర్థి మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
బీజేపీపై విపక్షాల విమర్శలు
లోక్ సభ స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై బీజేపీ ఎటువంటి చొరవ చూపట్లేదని కాంగ్రెస్ ఎంపీ కే. సురేశ్ ఆరోపించారు. ‘సభ సంప్రదాయం ప్రకారం స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. కానీ బీజేపీ విపక్షాలతో ఈ విషయంపై చర్చించడం లేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంపై బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.’ అని కే. సురేశ్ విమర్శించారు. మరోవైపు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ఇండియా కూటమి అభ్యర్థులను నిలబెడుతుందని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ లోక్ సభ ఎంపీ ఎన్ కే ప్రేమచంద్రన్ తెలిపారు. కచ్చితంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ చేస్తామని పేర్కొన్నారు.