Andhrapradesh
Gopi Thotakura : అంతరిక్షంలోకి వెళ్లబోతున్న మన తెలుగోడు.. ఇంతకీ, పైలట్ గోపీచంద్ తోటకూర ఎవరంటే?
Gopi Thotakura : మన తెలుగోడు మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నాడు. గతంలో ఎప్పుడూ కూడా తెలుగువాళ్లు ఎవరూ అంతరిక్షంలోకి వెళ్లలేదు. మొదటిసారి మన తెలుగు వ్యక్తి అయిన పైలట్ గోపీచంద్ తోటకూర ఆ రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు. ప్రముఖ బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థ న్యూ షెపర్డ్-25 (NS-25) మిషన్లో భాగంగా మొత్తం ఆరుగురు సభ్యులని ఎంపిక చేసింది.
వారిలో గోపిచంద్ కూడా టూరిస్ట్గా అడుగుపెట్టబోతున్నాడు. తద్వారా పైలట్ గోపీచంద్ తోటకూర పర్యాటకుడిగా అంతరిక్షంలోకి ప్రవేశించబోయే మొదటి భారతీయుడిగా మారబోతున్నాడు. బ్లూ ఆరిజిన్ ఎంపిక చేసిన ఎలైట్ సిబ్బందిలో గోపీచంద్ మరో ఐదుగురు అభ్యర్థులతో కలిసి భూమి వాతావరణం దాటి ప్రయాణం చేయనున్నాడు.
అమెరికాలో నివసిస్తున్న గోపీచంద్ ఒక వ్యవస్థాపకుడు మాత్రమే కాదు.. పైలట్ కూడా.. అయితే, భూమి వాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటి ప్రయాణించిన 31 మంది జాబితాలో చేరనున్నాడు. యవ్వనంలోనే ఆకాశ గమనంలో అన్నీ తెలిసిన వ్యక్తిగా గోపీచంద్ విమానయానం పట్ల ఉన్న మక్కువ కారణంగా విమానాలను నడిపేందుకు పైలట్ శిక్షణ తీసుకున్నాడు.
గోపీ ఒక పైలట్.. ఏవియేటర్ కూడా :
అంతటితో ఆగకుండా ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్శిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్తో పట్టభద్రుడయ్యాడు. బ్లూ ఆరిజిన్స్ ప్రకారం.. గోపీ ఒక పైలట్.. ఏవియేటర్ కూడా. డ్రైవింగ్ చేయడానికి ముందే ఎలా ఎగరాలో నేర్చుకున్నాడు. గోపీ పైలట్ బుష్, ఏరోబాటిక్, సీప్లేన్లు, అలాగే గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు, అంతర్జాతీయ మెడికల్ జెట్గా పనిచేశాడు. పైలట్ కాకుండా జీవితకాల యాత్రికుడిగా ఇటీవలే మౌంట్ కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించాడు.
విజయవాడలో జన్మించిన 30 ఏళ్ల గోపీచంద్.. ప్రస్తుతం హార్ట్స్ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న సంపూర్ణ ఆరోగ్యం గ్లోబల్ సెంటర్ అయిన ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ను నడుపుతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లబోయే ప్రతి సభ్యుడు బ్లూ ఆరిజిన్ ఫౌండేషన్, క్లబ్ ఫర్ ది ఫ్యూచర్ తరపున పోస్ట్కార్డ్ను తీసుకెళ్తారు.
#NewShepard #NS25 crew will include Mason Angel, Sylvain Chiron, Ed Dwight, Ken Hess, Carol Schaller, and Gopi Thotakura. Read more 🚀: https://t.co/KbAJkbRTvj pic.twitter.com/8QBFYPJkYj
— Blue Origin (@blueorigin) April 4, 2024
అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకుల కలలు, ఆకాంక్షలకు ప్రతీకగా చెప్పవచ్చు. న్యూ షెపర్డ్ పొడి ద్రవ్యరాశిలో దాదాపు 99శాతం బూస్టర్, క్యాప్సూల్, ఇంజిన్, ల్యాండింగ్ గేర్, పారాచూట్లతో సహా తిరిగి వినియోగించుకోవచ్చు. న్యూ షెపర్డ్ ఇంజిన్ అత్యంత సమర్థవంతమైన ద్రవ ఆక్సిజన్, హైడ్రోజన్తో ఇంధనంగా పనిచేస్తుంది. విమాన సమయంలో ఏకైక ఉప ఉత్పత్తి నీటి ఆవిరి, కార్బన్ ఉద్గారాలు మాత్రమేనని బ్లూ ఆరిజిన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
మిషన్ ప్రయోగ తేదీపై అస్పష్టత :
ఈ మిషన్లో మాజీ వైమానిక దళ కెప్టెన్ ఎడ్ డ్వైట్ కూడా ఉన్నారు. ఆయన 1961లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీచే దేశం మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థిగా ఎంపిక అయ్యారు. అయితే, అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఆయనకు ఎప్పుడూ లభించలేదు. బిలియనీర్ జెఫ్ బెజోస్ సొంత స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్.. ఇదివరకే అనేక న్యూ షెపర్డ్ మిషన్ స్పేస్ యాత్రలను పూర్తి చేసింది. 2021లో జెఫ్ బెజోస్ సహా 3 పర్యాటకులు రోదసీలోకి అడుగుపెట్టి వచ్చారు. మూడేళ్ల తర్వాత బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్-25 మిషన్ చేపట్టనున్న ఈ యాత్రలో గోపీచంద్ తోటకూర సహా మొత్తం 6 సభ్యులను ఎంపిక చేశారు.
అందులో గోపీచంద్ సహా ఫ్రాన్స్ బిజినెస్మెన్ సిల్వైన్ చిరోన్, వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, కరోల్ షాలర్, వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్, బిజినెస్మెన్ కెన్నెత్ ఎల్ హెస్ ఈ రోదశీ యాత్రకు సిద్ధమవుతున్నారు. కంపెనీ వాణిజ్య ప్రయోజనాల కోసం న్యూ గ్లెన్ అనే భారీ రాకెట్ను కూడా అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది తొలి విమానాన్ని ప్లాన్ చేస్తోంది. 98 మీటర్లు (320 అడుగులు) ఎత్తు ఉండే.. ఈ రాకెట్ 45 మెట్రిక్ టన్నుల పేలోడ్లను తక్కువ భూ కక్ష్యలోకి తీసుకెళ్లేలా రూపొందించారు.