Telangana
గుడ్ న్యూస్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం- ఇక పది రోజులు పుస్తక ప్రియులకు పండగే! – HYDERABAD BOOK FAIR 2024
Hyderabad Book Fair 2024 Begins Today Inaugurated by CM Revanth Reddy : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుక్ ఫెయిర్ ప్రారంభమయ్యింది. పది రోజుల పాటు సాగనున్న ఈ పుస్తకాల పండుగ ఎన్టీఆర్ స్టేడియంలో 300 పైగా స్టాళ్లతో కనువిందు చేయనుంది. కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా వాటి రచయితలను కూడా కలుసుకునే గొప్ప అవకాశం ఇది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2024 గురించిన మరిన్ని వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
వందల స్టాళ్లు : హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి (గురువారం 19) నుంచి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్(హెచ్బీఎఫ్)ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని హెచ్బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్బీఎఫ్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన బుక్ఫెయిర్లో సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికిపైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు వివరించారు.
300 Plus Stalls in Book Fair : బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్గా నామకరణం చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కోటేలతో సలహా కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు, పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో హెచ్బీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్(వాసు), కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.