Health
ప్రతి ఒక్కరూ డాక్టరే.. సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న వైనం
మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఎవరో ఏదో చెప్తే..అలాగే ఫాలో అయిపోతే అంతా సెట్ అవుతుందనేది భ్రమ. కొన్నిసార్లు వైద్య నిపుణులు ట్రీట్మెంట్ ఇచ్చినా బాడీ రెస్పాండ్ కాదు. అలాంటిది గూగుల్ సమాచారమో లేక ఇంకేవరో స్వయం ప్రకటిత మేధావులు చెప్పినట్లు చేస్తే బాగుంటామని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కావాల్సినంతే తినాలి. తిన్నది అరిగించడం కోసం ఎంతో కొంత శారీరక శ్రమ చేయాలని చెప్తున్నారు.
సీజనల్ వ్యాధులకు అయితే సొంత వైద్యం చేసుకోవద్దనేది వైద్య నిపుణుల సూచన. జ్వరం వచ్చిన వెంటనే పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. డాక్టర్ల సూచన లేకుండా ట్యాబ్లెట్లు వాడటం చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. రెండుమూడు రోజులు కంటిన్యూగా జ్వరం ఉంటే కచ్చితంగా టెస్టులు చేయించుకోవాల్సిందేని చెబుతున్నారు.
బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు వేర్వేరు రోగ లక్షణాలు ఉంటాయి. కొందరు యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతుండటంతో అవి వ్యాధి లక్షణాలను బయటపడకుండా చేస్తాయని అంటున్నారు డాక్టర్లు. బయటికి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా..లోపల మాత్రం డెంగ్యూ ముదిరి ప్లేట్లెట్స్ పడిపోతాయని అలర్ట్ చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ బాడీలోని ఊపిరితిత్తుల్లోకి, లివర్లోకి చేరిన తర్వాత హాస్పిటల్కు వెళ్తున్నారు. రెండుమూడ్రోజుల్లో కోలుకోవాల్సిన వారు..అప్పుడు వారాలపాటు చికిత్స పొందాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్లు.
డెంగ్యూ అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం భ్రమ అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. పెయిన్ కిల్లర్లు, ఆకు రసాలు తాగి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి ట్యాబ్లెట్లు కూడా ఎంతవరకు పనిచేస్తాయో క్లారిటీ లేదంటున్నారు వైద్య నిపుణులు. సొంత వైద్యం మీద ఆధారపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దనేది వాళ్ల సూచన.
మరికొందరు.. ఫెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల్ని వాడుతుంటారు. అనారోగ్యానికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి?.. ఏ మందులైతే మంచిదో..డాక్టర్లు నిర్ధారించి రాసిన మెడిసిన్ అది. అదే ప్రిస్క్రిప్షన్ మిగతా వారికి పనికి రాదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మి చాలామంది ఆస్పిరిన్, ఎకోస్పిరిన్లు వాడేస్తున్నారు. ఇక కొంతమంది విటమిన్ సీ, డీ, జింక్ మందులను రోజువారీ మందుల మాదిరిగా వేసుకుంటున్నారు. మీతి మీరిన మెడిసిన్ కూడా మంచిది కాదంటున్నారు డాక్టర్లు. సొంత వైద్యంతో చాలామందికి బీపీ, షుగర్ అటాక్ అవుతుందంటున్నారు వైద్య నిపుణులు.
మితిమీరిన మందులు వాడటంతో
మితిమీరిన మందులు వాడటంతో దీర్ఘకాలిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన జన్యువులు పాడై.. రాబోయే తరాలకు ఇప్పటి రోగాలను వారసత్వంగా అందించే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకినప్పుడు మాత్రమే యాంటీ వైరల్ డ్రగ్స్ని వాడాలని సూచిస్తున్నారు. లేకుంటే బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అజిత్రోమైసిన్ వంటి యాంటి బయాటిక్ మందులు ఎక్కువగా వాడితే గుండెపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.
సొంత వైద్యం పెరగడానికి అందరికీ సోషల్ మీడియాలో అందుబాటులోకి రావడమే కారణంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు.. యూట్యూబ్, గూగుల్లో సెర్చ్ చేసి ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్లు, ప్రకృతి వైద్యం అంటూ ఏది పడితే అది వాడేస్తున్నారు. అదే అనారోగ్యానికి కారణం అవుతోంది.