Telangana
DOST Mobile App: తెలంగాణ విద్యార్ధులకు గమనిక.. నయా పైసా ఖర్చులేకుండా ‘దోస్త్ యాప్’లో రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, మే 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగ ఆన్న డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్) తొలి విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సాధారణంగా విద్యార్ధులు దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 25వ తేదీతో తొలివిడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలు పొందే అవకాశం కల్పిస్తారు. చివరి విడత పూర్తయ్యాక తరగతులు ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది విద్యార్థులు మరింత సులువుగా దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నత విద్యా శాఖ కొత్తగా ‘దోస్త్ మొబైల్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా ఫోన్ ద్వారా సులభతరంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్ధులు దోస్త్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి దోస్త్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత మొబైల్ నంబరు ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. దీని ద్వారా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు.
అనంతరం విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి తదితర వివరాలు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖ గుర్తింపు కోసం అందులోనే ఫొటో తీసుకునే వెసులుబాటు సైతం ఉంటుంది. విద్యార్థి తన ఫొటోను నావిగేట్ చేస్తున్న సమయంలో దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
దోస్త్ వెబ్సైట్ మాదిరిగానే.. యాప్లో కూడా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫాంలో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి. కాలేజీలు, కోర్సులు, ఫీజుల వివరాలను తెలుసుకొని వెబ్ ఆప్షన్ ప్రారంభమైన రోజున వాటిని పూరిస్తే సరిపోతుంది. అంతే.. ఈప్రక్రియ ముగిసినట్లే. అనంతరం ఆయా విద్యార్ధులకు సీట్లు అలాట్ అవుతాయి.