International

Asif Ali Zardari: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అసీఫ్ అలీ జర్దారీ

Published

on

Pakistan President Asif Ali Zardari News: పాకిస్థాన్‌కి రెండోసారి అధ్యక్షుడిగా అసీఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. ముందు నుంచి అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరే ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు అధికారికంగా ఆ పేరునే ప్రకటించారు. పాకిస్థాన్‌కి 14వ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కోఛైర్‌ పర్సన్‌గా ఉన్న జర్దారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల తరవాత నవాజ్ షరీఫ్‌ Pakistan Muslim League (PML)తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ తరపున అభ్యర్థిగా జర్దారీ పోటీ చేయగా… ఆయనకు ప్రత్యర్థిగా Sunni Ittehad Council పార్టీకి చెందిన మహమూద్ ఖాన్ బరిలోకి దిగారు. ఈ పోలింగ్‌లో జర్దారీకి 255 ఓట్లు రాగా.. మహమూద్‌కి 119 ఓట్లు మాత్రమే వచ్చాయి.
పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం… నేషనల్ అసెంబ్లీకి చెందిన ఎలక్టోరల్ కాలేజ్ జర్దారీని అధ్యక్షుడిగా డిక్లేర్ చేసింది. వ్యాపార రంగంలో రాణించిన జర్దారీ.. ఆ తరవాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు. పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీరు భుట్టో (Benazir Bhutto) భర్తగా ఎప్పటి నుంచో రాజకీయాలను చాలా దగ్గరి నుంచి పరిశీలించారు. 2008- 2013 వరకూ పాక్‌ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రెండోసారి ఈ పదవి దక్కించుకున్నారు.

పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ 24వ ప్రధానిగా ప్రధానిగా ప్రమాణం చేసిన షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు స్వీకరించారు. పాక్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ తరవాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. దాదాపు 16 నెలల పాటు పాకిస్థాన్‌కి ప్రధానిగా సేవలు అందించిన ఆయనతో ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఆగస్టులో పాక్ పార్లమెంట్‌ రద్దు
గతేడాది ఆగస్టులో పాక్ పార్లమెంట్‌ రద్దు అయింది. గత నెలలో ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షెహబాజ్‌కే మరోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించాయి. మొత్తం 265 మంది ఉన్న జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ PTI కి మద్దతునిచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ PML-N పార్టీ (Pakistan Muslim League-Nawaz ) 75 సీట్లు గెలుచుకుంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52 చోట్ల విజయం సాధించింది. ప్రధాని పదవికి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా పీటీఐ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరికి 201 మంది నేతలు షెహబాజ్‌ షరీఫ్‌కి అనుకూలంగా ఓటు వేశారు. పీటీఐ మద్దతు తెలిపిన నేత ఓమర్ ఆయుబ్ ఖాన్ ఓటింగ్‌లో ఓటమిచెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version