Andhrapradesh

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన ఏకైక మహిళ తెలుగువారే

Published

on

Karnataka RajBhavan వీఎస్ రమాదేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం చూసుకునే ఈ రాజ్యాంగ సంస్థకు ఇప్పటివరకు 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు.

ప్రస్తుతం ఆ బాధ్యతలలో ఉన్న రాజీవ్ కుమార్ 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్.

అయితే, ఇప్పటివరకు ఒక్క మహిళకు మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం దక్కిందన్న విషయం తెలుసా?
అంతేకాదు, ఆ ఒకే ఒక్క మహిళ తెలుగువారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో ఉన్నది స్వల్పకాలమే అయినప్పటికీ ఇప్పటివరకు ఆ రాజ్యాంగ పదవి చేపట్టిన ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. ఆమే వీఎస్ రమాదేవి. వీఎస్ రమాదేవి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందినవారు. ఏలూరు, హైదరాబాద్‌లలో చదువుకున్న ఆమె సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తరువాత కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేశారు. కేంద్ర న్యాయశాఖలో స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్‌ మెంబర్ సెక్రటరీగా పనిచేసిన ఆమె రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా..

వీఎస్ రమాదేవి భారతదేశ తొమ్మిదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 1990 నవంబరు 26న ఆ బాద్యతలు చేపట్టిన ఆమె అదే ఏడాది డిసెంబర్ 11 వరకు ఆ పదవిలో ఉన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన ఇద్దరిలో ఆమె ఒకరు. రమాదేవి కంటే ముందు ఆర్వీఎస్ పేరి శాస్త్రి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. రమాదేవి 16 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నప్పటికీ భారతదేశ ఎన్నికల విధానం, వ్యవస్థకు సంబంధించి ప్రజలకు సమగ్ర సమాచారం అందాలన్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఎలక్షన్ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన ఎస్‌కే మేందీరత్తాతో కలిసి ఓ పుస్తకం ప్రచురించారు.

‘హౌ ఇండియా వోట్స్ – ఎలక్షన్ లాస్, ప్రాక్టీస్, ప్రొసీజర్స్’ పేరిట ప్రచురించిన ఈ పుస్తకంలో రాష్ట్రాల శాసనసభలు, పార్లమెంటు, ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయనేది క్షుణ్ణంగా వివరించారు.

Advertisement

ఆ రెండు పదవుల్లోనూ తొలి మహిళ ఆమెనే..
వీఎస్ రమాదేవి 1993, 1997 మధ్య రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు. ఈ పదవి చేపట్టినవారిలో తొలి మహిళగానూ రమాదేవికి గుర్తింపు లభించింది. ఉద్యోగ విరమణ తరువాత రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం కర్ణాటక గవర్నరుగానూ ఆమె పనిచేశారు. కర్ణాటకకు గవర్నర్లుగా పనిచేసినవారిలో తొలి మహిళ ఆమె.

భాష సరళం, శైలి దృఢం

రమాదేవి రచయిత్రిగానూ తెలుగునాట చాలామందికి పరిచయమే. తెలుగు పత్రికలలో ఆమె కథలు, ధారావాహికలు రాశారు.
తెలుగులో విపులాచపృథ్వీ, అనంతం, దేవుడికి ఉత్తరం, లేడీస్ కంపార్ట్‌మెంట్, తల్లీబిడ్డలు, మజిలీ వంటి పుస్తకాలు రాశారు. రమాదేవి రచనలు సరళమైన భాష, దృఢమైన శైలిలో ఉంటాయని, వందలాది వచన రచనలతో ఆమె సాహితీరంగంలో తానేమిటో నిరూపించుకున్నారని రచయిత, సీనియర్ పాత్రికేయుడు జంధ్యాల శరత్ బాబు ‘బీబీసీ’తో చెప్పారు. మహిళల సంక్షేమ చట్టాలకు సంబంధించి ఆమె కలం, గళం ఎన్నడూ రాజీ పడలేదని, మజిలీ వంటి తన రచనలలో సామాన్యుల జీవనాన్ని చిత్రించారని ఆయన అన్నారు. పాలన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆమె వ్యాసాలు, రూపకాలు, కథలు రాసిన విలక్షణ ప్రయోగశీలి అని శరత్ బాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version