International
అమెరికా రాజకీయాల్లో మనోళ్ల సత్తా.. ఉన్నత పదవుల్లో ఇండియన్ అమెరికన్స్
అగ్రరాజ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు మనోళ్లు. ఉపాధి కోసం, ఉన్నత చదవుల కోసమే కాదు.. అవసరమైతే జెండా పాతేసి.. అమెరికాను ఏలి చూపిస్తామని ప్రూవ్ చేస్తున్నారు. కిందిస్థాయి మేయర్ పదవుల నుంచి ఏకంగా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వరకు అన్ని పదవులకు పోటీ పడుతున్నారు. పొలిటికల్గా ఉన్నత పదవుల రేసులో కొనసాగుతున్నారు ఇండియన్ అమెరికన్స్. భారతీయ మూలాలున్న వారిలో చాలామంది అమెరికా రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు. త్వరలో జరగనున్న యూఎస్ ఎన్నికల్లోనూ భారత సంతతి లీడర్లు పోటీలో ఉన్నారు.
అమెరికా ఎన్నికల్లో ఈ సారి కూడా ఇండియన్స్ గురించే చర్చ జరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరు కన్ఫామ్ అయింది. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ రేసులో ఉండబోతున్నారు. ఈ జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి మన తెలుగమ్మాయే. జేడీ వాన్స్ పొలిటికల్ కెరీర్లో ఉషా కీలక పాత్ర పోషించారు.
ఉషా చిలుకూరి పేరెంట్స్ ది ఏపీ. ఆమె పుట్టింది కాలిఫోర్నియాలో. జేడీ వాన్స్, ఉషా చిలుకూరికు ముగ్గురు పిల్లలు. భర్త జేడీ వాన్స్ రాజకీయ ప్రచారాల్లో ఉషా కీలక పాత్ర పోషించారు. 2016, 2022 సెనేట్ క్యాంపెయిన్లో ఆమె సహకరించారు. 2018 నుంచి ఒహియో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో ఆమె రిజిస్టర్ చేసుకున్నారు.
ఏ పార్టీ గెలిచినా సరే..
అగ్రరాజ్యమైన అమెరికాలో ఈసారి ఏ పార్టీ గెలిచినా ఇండియన్ అమెరికనే సెకండ్ సిటిజన్. అటు కమలా హారిస్ అయినా ఇటు ఉషా చిలుకూరి భర్త వాన్స్ గెలిచినా మనమే వైట్ హౌస్ లో ఉంటాం. పరిస్థితులు, పార్టీ శ్రేణుల్లో వస్తోన్న మార్పుకు అనుగుణంగా భారతీయ మూలాలున్న నేతలకు అగ్రరాజ్యమైన అమెరికా రాజకీయ పార్టీలు గుర్తింపు ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీ డెమోక్రాట్లు కమలాహారిస్ను వైస్ ప్రెసిడెంట్ను చేశారు. రిపబ్లికన్లు మరో భారతీయ మూలాలున్న మహిళను వివాహమాడిన ఒహాయో సెనేటర్ను జేడీ వాన్స్ను వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు.
వచ్చే నవంబర్ 4న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ 270 మంది సెనేటర్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం ట్రంప్కు దక్కుతుంది. జేడీవాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. అప్పుడు ఆయన భార్య ఉషా చిలుకూరి అమెరికా సెకండ్ లేడీ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అటు రిపబ్లికన్స్ గెలిచినా ఇటు డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చినా ఓ భారతీయ మూలాలున్న వ్యక్తి వైట్హైజ్లో కాలు మోపడం ఖాయం. కారణాలు ఏవైనా.. రెండు పార్టీల తరఫునా భారతీయ మూలాలతో అనుబంధం ఉన్నవారినే వైస్ ప్రెసిడెంట్లుగా ఎంచుకోవడం ఇండియాకు ప్రౌడ్ మూమెంట్.
రెండు ప్రధాన పార్టీల స్ట్రాటజీలే వేరు
అమెరికాకు వైస్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయడంలో రెండు ప్రధాన పార్టీల స్ట్రాటజీలే వేరు. 2019 నుంచే ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తులకు రాజకీయంగా ఉన్నత పదవులు ఇస్తూ వస్తున్నాయి అమెరికా రాజకీయ పార్టీలు. తమిళనాడు మూలాలున్న కమలాహారిస్ ను డెమోక్రాట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసినప్పుడే భారత్కు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమైంది. ఇప్పుడు రిపబ్లికన్స్ కూడా అదే బాట పట్టారు. నిజానికి రిపబ్లికన్లలోనే ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారు.
ఇండియాలో లాగా అమెరికన్ పాలిటిక్స్లో కోటాలు ఉండవు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడ, మగ అనే తేడా లేకుండా ఇండియన్ అమెరికన్స్ 40, 50 ఏళ్లలో ఉన్నత స్థానాలను చేరుకోవడం సాధించడం గొప్ప విషయమే. యూఎస్ ఎన్నికల్లో విజయం సాధించిన మనోళ్లందరూ స్వశక్తితో పైకి వచ్చినవారే. కమలా హారిస్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ మొదలు ప్రస్తుతం ఉషా వరకు అందరూ ఎంతో కష్టపడి జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా ఎదిగినవారే. ఓ రకంగా చెప్పాలంటే ఒక ఇండియన్ అమెరికన్గా మారడానికి ఇంత కాలం పట్టింది. వైట్ ప్రివిలైజ్ అనే దానికి భిన్నంగా ఇండియన్ అమెరికన్లు ఎదుగుతున్నారు.
అమెరికా దేశ జనాభాలో భారతీయులు కేవలం 1.5శాతం లోపే ఉన్నారు. అయినప్పటికీ ఈ ఏడాది రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ఇద్దరు భారతీయ అమెరికన్లు- నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీ పడ్డారు. భారతీయ మూలాలున్న తల్లి ఉన్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మరోసారి పోటీ పడబోతున్నారంటే అందుకు కారణం వైవిధ్యమైన అమెరికా రాజ్యాంగమే. ఇలా అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతోంది.